25, ఆగస్టు 2026, మంగళవారం

రామగుండం ఓటర్లకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న 60 డివిజన్లలో వార్డు సభలు! మీ పేరు ఓటర్ లిస్ట్‌లో ఉందా..?

రామగుండం ఓటర్లకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న 60 డివిజన్లలో వార్డు సభలు! మీ పేరు ఓటర్ లిస్ట్‌లో ఉందా?

SIRలో భారీగా ఓటర్ల పేర్లు గల్లంతు.. ఫారం 6, 7, 8తో అభ్యంతరాలకు అవకాశం | 5,500 నో మ్యాపింగ్, 49,034 అనామలీస్ ఓటర్లకు నోటీసులు
రామగుండంలో SIRపై అధికారుల కీలక సమావేశం

రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో వార్డు సభల నిర్వహణకు సంబంధించిన ప్రాంతాలు

SIR ఓటరు జాబితా సవరణకు సంబంధించిన ఫారం 6, 7, 8

ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలిస్తున్న ఓటర్లు

రామగుండం ఓటర్లకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న 60 డివిజన్లలో వార్డు సభలు!

రామగుండం, ఆగస్టు 25 (ఇది మన హక్కు): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా ఈ నెల 27వ తేదీన రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లలో వార్డు సభలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ తెలిపారు.

🔹 ముసాయిదా ఓటరు జాబితాలోని పేర్లను చదవడం
🔹 ఓటర్ల అభ్యంతరాలు స్వీకరించడం
🔹 ఫారం 6, 7, 8 స్వీకరించడం
🔹 అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు జాబితా నుంచి తప్పిపోకుండా చూడడం

కోసం ఈ వార్డు సభలను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.

రామగుండం నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,13,990 మంది ఓటర్లు ఉండగా, ముసాయిదా జాబితాలో 1,83,233 మంది ఓటర్ల పేర్లు మాత్రమే ప్రకటించిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

అలాగే నో మ్యాపింగ్ కింద 5,500 మందికి, అనామలీస్ కింద 49,034 మందికి నోటీసులు జారీ చేసి, అవసరమైన ధ్రువీకరణ పత్రాలను స్వీకరించాలని అధికారులకు సూచించారు.

నిర్ణీత గడువులో SIR ప్రక్రియను పూర్తి చేసి, అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు కూడా ఓటరు జాబితా నుంచి తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జె. అరుణ శ్రీ అధికారులను ఆదేశించారు.

ఎన్‌టీపీసీ మిలీనియం హాల్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి, రామగుండం, అంతర్గాం, పాలకుర్తి మండలాల తహశీల్దార్లు రవీందర్, ప్రసాద్, సునీత తదితరులు పాల్గొన్నారు.

ముఖ్య గమనిక:
రామగుండం పరిధిలోని ఓటర్లు ఈ నెల 27న తమ డివిజన్‌లో నిర్వహించే వార్డు సభకు హాజరై, ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరు, వివరాలు సరిగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు.


15, ఆగస్టు 2026, శనివారం

రామగుండం నగరపాలక సంస్థలో 17 మంది సిబ్బందికి ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రాలు..

రామగుండం నగరపాలక సంస్థలో 17 మంది సిబ్బందికి ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రాలు..

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రశంసా పత్రాలు అందజేత

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రామగుండం నగరపాలక సంస్థ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేస్తున్న అధికారులు

రామగుండం, ఆగస్టు 15 (ఇది మన హక్కు): ఉత్తమ సేవలు అందించినందుకు రామగుండం నగరపాలక సంస్థకు చెందిన 17 మంది సిబ్బందికి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రశంసా పత్రాలు అందజేశారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో విశేషంగా పనిచేసిన సిబ్బందిని గుర్తించి ఈ ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రాలు అందుకున్న రామగుండం నగరపాలక సంస్థ సిబ్బంది

తేజస్విని (ఏఈ), శ్రావణ్ కుమార్ (టీపీబీఓ), శ్రీపాల్ (యూడీఆర్‌ఐ), సౌమ్య, నరేష్ (జూనియర్ అసిస్టెంట్లు), శ్రీనివాస్ (జూనియర్ అకౌంటెంట్), విజయ్ కుమార్ (వార్డు ఆఫీసర్), కుమారస్వామి (పీఆర్‌ఓ), కిరణ్ కుమార్, యుగాంత్ (కంప్యూటర్ ఆపరేటర్లు), తిరుపతి (శానిటరీ జవాన్), తాజుద్దీన్ (పంప్ ఆపరేటర్), ప్రశాంత్ (వార్డు అసిస్టెంట్), సాగర్ (ఎలక్ట్రీషియన్), అశోక్ (ఆఫీస్ సబార్డినేట్), రమేష్ (ట్రాలీ డ్రైవర్), తిరుపతి (డ్రెయిన్ క్లీనర్)లు ప్రశంసా పత్రాలు అందుకున్నారు..

ప్రశంసా పత్రాలు అందుకుంటున్న రామగుండం నగరపాలక సంస్థ సిబ్బంది

ప్రభుత్వ విప్ విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష చేతుల మీదుగా నగరపాలక సంస్థ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.

ఉత్తమ సేవలకు గుర్తింపు లభించడంపై సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. తమ విధులను మరింత బాధ్యతగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఉత్తమ సేవలు అందించిన సిబ్బందిని అభినందిస్తున్న మేయర్ మహంకాళి స్వామి, కమిషనర్ జె. అరుణ శ్రీ

ఈ సందర్భంగా రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, కమిషనర్ జె. అరుణ శ్రీ ఉత్తమ సేవలు అందించిన సిబ్బందిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజలకు అందిస్తున్న సేవల్లో సిబ్బంది చూపుతున్న కృషిని అభినందిస్తూ, ఇదే స్ఫూర్తితో మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలని వారు ఆకాంక్షించారు..




8, ఆగస్టు 2026, శనివారం

రామగుండం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి: రాష్ట్ర మంత్రులకు మేయర్ మహంకాళి స్వామి వినతి

రామగుండం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి: రాష్ట్ర మంత్రులకు మేయర్ మహంకాళి స్వామి వినతి

వరద నియంత్రణ, గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, పారిశుద్ధ్య సిబ్బంది, ఎల్‌ఆర్‌ఎస్, విద్యుత్ సమస్యలపై మంత్రులకు వినతిపత్రం

హైదరాబాద్ సచివాలయంలో మంత్రుల స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి

రామగుండం నగర అభివృద్ధి సమస్యలపై మంత్రులకు వినతిపత్రం సమర్పిస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి

రామగుండం అభివృద్ధి సమస్యలపై మంత్రుల స్థాయి సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు

రామగుండం, ఆగస్టు 8 (ఇది మన హక్కు): రామగుండం నగర అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయడంతో పాటు నగరంలోని పలు సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర మంత్రులను నగర మేయర్ మహంకాళి స్వామి కోరారు. హైదరాబాద్ సచివాలయంలో శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో మంత్రుల స్థాయిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు.

ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్‌తో పాటు నగర మేయర్ మహంకాళి స్వామి కూడా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ నేతృత్వంలో రామగుండం నగరానికి సంబంధించిన పలు సమస్యలపై మంత్రులకు వినతిపత్రం సమర్పించినట్లు మేయర్ తెలిపారు.

రామగుండం వరదల నివారణకు కరకట్ట నిర్మించాలి

గోదావరి నదికి సమీపంలో రామగుండం నగరం ఉన్నందున వరద ముప్పును శాశ్వతంగా నివారించేందుకు సింగరేణి సంస్థ ఓబీ మట్టిని వినియోగించి కరకట్ట నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు

గోదావరి పుష్కరాలు ప్రారంభం కావడానికి కొద్ది నెలలు మాత్రమే సమయం ఉన్నందున రామగుండం నగరంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని మేయర్ తెలిపారు. ప్రధాన రైల్వే మార్గం ఉన్న ప్రాంతం కావడంతో దేశవ్యాప్తంగా భక్తులు రామగుండం ప్రాంతానికి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
పుష్కరాల ఏర్పాట్ల కోసం ఇప్పటికే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో రూ.150 కోట్లతో డీపీఆర్ సమర్పించినట్లు తెలిపారు. త్వరితగతిన నిధులు మంజూరు చేస్తే నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుందని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.

ఖాళీగా ఉన్న పబ్లిక్ హెల్త్ వర్కర్ పోస్టులు భర్తీ చేయాలి

రామగుండం నగర పాలక సంస్థలో సుమారు 30 ఏళ్ల క్రితం 85 మంది రెగ్యులర్ పబ్లిక్ హెల్త్ వర్కర్లు ఉండగా ప్రస్తుతం కేవలం 37 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు జనాభా ప్రాతిపదికన పబ్లిక్ హెల్త్ వర్కర్ల సంఖ్యను పెంచాలని కోరారు.

వృద్ధ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు అవకాశం ఇవ్వాలి

వృద్ధులు, అనారోగ్యంతో పని చేయలేని ఔట్‌సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్న విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. అదనపు ఆర్థిక భారం లేకుండా వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న సిబ్బందిని యువకులతో భర్తీ చేసే విధానానికి అనుమతి ఇవ్వాలని కోరారు.
విలీన గ్రామ పంచాయతీల నుంచి వచ్చిన తాత్కాలిక కార్మికుల్లో కూడా వృద్ధులు ఉన్నందున వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రత్యేక పారిశుద్ధ్య వాహనాలకు ఆపరేటర్లు కావాలి


రామగుండం నగర పాలక సంస్థ వద్ద ఉన్న ప్రత్యేక పారిశుద్ధ్య వాహనాలను సాధారణ డ్రైవర్లు నడపలేరని తెలిపారు. జేసీబీ, బ్యాక్‌హో లోడర్ వంటి వాహనాల నిర్వహణకు అవసరమైన ఆపరేటర్లను ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

సింగరేణి, ఎన్టీపీసీ సీఎస్‌ఆర్, డీఎంఎఫ్‌టీ నిధులు నగర అభివృద్ధికి వినియోగించాలి

రామగుండం పరిధిలోని సింగరేణి, ఎన్టీపీసీ సంస్థల సీఎస్‌ఆర్, డీఎంఎఫ్‌టీ నిధులను నగర పాలక సంస్థ ఖాతాలో జమ చేసి స్థానిక ప్రజల అభివృద్ధి కోసం వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సంస్థలకు భూములు ఇచ్చి, ఉపాధి కోల్పోయి, కాలుష్య సమస్యలను ఎదుర్కొంటున్న రామగుండం ప్రాంత ప్రజలకు ఈ నిధుల ద్వారా ప్రయోజనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

సింగరేణి రివైజ్డ్ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించేలా ఆదేశాలు


సింగరేణి సంస్థ గత 25 ఏళ్లుగా ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో పాత మొత్తాన్నే చెల్లిస్తోందని మేయర్ పేర్కొన్నారు. 2015 నుంచి రివైజ్డ్ ట్యాక్స్‌కు సంబంధించి డిమాండ్ నోటీసులు జారీ చేసినప్పటికీ పాత పన్ను మొత్తమే చెల్లిస్తున్నారని తెలిపారు.
సింగరేణి సీఎండీకి తగిన ఆదేశాలు జారీ చేసి రివైజ్డ్ ప్రాపర్టీ ట్యాక్స్ మొత్తాన్ని చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనివల్ల నగర పాలక సంస్థ ఆదాయం పెరుగుతుందని తెలిపారు.

ఖాళీ భూములకు వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వసూలు చేయాలి

సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ సంస్థల వద్ద వేల ఎకరాల ఖాళీ భూములు ఉన్నాయని, వాటికి సంబంధించి వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ చెల్లించేలా ఆయా సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ఎల్‌ఆర్‌ఎస్ కటాఫ్ తేదీని పొడిగించాలి

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం కింద 26.08.2020 నాటికి రిజిస్ట్రేషన్ పూర్తయిన అనధికారిక ప్లాట్లు, లేఅవుట్లకు మాత్రమే అవకాశం ఉందని తెలిపారు.
కటాఫ్ తేదీ ముగిసి దాదాపు ఆరేళ్లు గడిచినందున ఆ తర్వాత నగరాలు, పట్టణాలు విస్తరించాయని, మధ్యతరగతి ప్రజలు పెద్ద సంఖ్యలో ప్లాట్లు కొనుగోలు చేశారని పేర్కొన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్ లేకపోవడంతో భవన నిర్మాణ అనుమతులు రాకపోవడంతో మున్సిపాలిటీలకు భవన నిర్మాణ అనుమతి ఫీజులు, ఓపెన్ స్పేస్ ఛార్జీలు, నాలా ఫీజులు, ఇతర అభివృద్ధి రుసుముల రూపంలో వచ్చే ఆదాయం నిలిచిపోయిందని తెలిపారు.
కాబట్టి ఎల్‌ఆర్‌ఎస్ కటాఫ్ తేదీని 26.08.2020 నుంచి ప్రస్తుత సంవత్సరం వరకు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు.

వరదల శాశ్వత నివారణకు చర్యలు తీసుకోవాలి

ఇటీవల కురిసిన భారీ వర్షాల సమయంలో సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటితో పరిసర ప్రాంతాలు మునిగిపోయాయని తెలిపారు.
అయితే రామగుండం నగర పాలక సంస్థ మూడు నెలల ముందుగానే కాలువల్లో పూడికతీత పనులు చేపట్టడం వల్ల నగర పరిధిలో గతంలో మాదిరిగా పెద్దగా వరద ముప్పు ఏర్పడలేదని పేర్కొన్నారు.
భవిష్యత్తులో వరద సమస్యలు తలెత్తకుండా వరద కాలువల నిర్మాణం, నిర్వహణపై సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేయాలని కోరారు.


33 కేవీ విద్యుత్ లైన్ల ఆధునీకరణకు చర్యలు తీసుకోవాలి

రామగుండం నగరానికి విద్యుత్ సరఫరా చేసే ప్రధాన 33 కేవీ లైన్లు సుమారు 50 ఏళ్ల క్రితం సిమెంట్ పోల్స్‌తో ఏర్పాటు చేశారని మేయర్ తెలిపారు. ప్రస్తుతం ఈ లైన్లు ఎన్టీపీసీ కాంపౌండ్ వాల్ లోపల ఉండటంతో నిర్వహణ పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
చెట్లు, పొదలు పెరగడం, లైన్లు మరియు పోల్స్ జీవితకాలం ముగియడం వల్ల చిన్నపాటి వర్షాలు, ఈదురుగాలులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని తెలిపారు.
ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సుమారు 12 కిలోమీటర్ల మేర ఆధునిక టవర్ లైన్ ఏర్పాటు చేసేలా ట్రాన్స్‌కోకు ఆదేశాలు జారీ చేయాలని మంత్రులను కోరారు..


7, ఆగస్టు 2026, శుక్రవారం

ఇల్లు ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లు?.. వరద బాధితులకు న్యాయం ఎక్కడ? మారేడుపల్లి వాసుల ఆవేదన

ఇల్లు ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లు?.. వరద బాధితులకు న్యాయం ఎక్కడ? మారేడుపల్లి వాసుల ఆవేదన

వరదల్లో నష్టపోయిన నిరుపేదలకు ఇళ్ల మంజూరులో అన్యాయం జరుగుతోందని గ్రామస్థుల ఆగ్రహం.. అర్హులైన బాధితులను గుర్తించి వెంటనే న్యాయం చేయాలని విజ్ఞప్తి
మారేడుపల్లి గ్రామంలో వరదలతో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలిస్తున్న గ్రామస్థులు

జగిత్యాల, ఆగస్టు 7 (ఇది మన హక్కు): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామంలో వరదల కారణంగా తీవ్ర నష్టపోయిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అందడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఇల్లు కోల్పోయిన, గోడలు కూలిపోయిన, నివాసానికి అనువుగా లేని ఇళ్లలో జీవిస్తున్న నిరుపేదలకు కాకుండా ఇప్పటికే ఇల్లు ఉన్న కొందరికి పథకం ప్రయోజనం లభిస్తోందని ఆరోపిస్తున్నారు..

ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో మారేడుపల్లి గ్రామంలోని పలువురు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కొన్ని ఇళ్లు పూర్తిగా దెబ్బతినగా, మరికొన్ని నివాసయోగ్యం కాకుండా మారాయని గ్రామస్థులు చెబుతున్నారు. అయినప్పటికీ అర్హులైన వరద బాధితుల పేర్లు జాబితాలో లేకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తోందని పేర్కొంటున్నారు.
ఇప్పటికే పక్కా ఇళ్లు ఉన్న కొందరికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు జరుగుతుండగా, నిజంగా అవసరమైన పేద కుటుంబాలు పథకానికి దూరమవుతున్నాయని వారు ఆరోపించారు. వరదలతో నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించి, అర్హత ప్రమాణాల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం నిజమైన అర్హులకు చేరితేనే దాని లక్ష్యం నెరవేరుతుందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. గ్రామంలో ప్రత్యేక సర్వే నిర్వహించి, వరదలతో నష్టపోయిన నిరుపేద కుటుంబాలను గుర్తించి వెంటనే ఇళ్లను మంజూరు చేయాలని, అలాగే తాత్కాలిక ఆర్థిక సాయం కూడా అందించాలని కోరుతున్నారు.
గ్రామస్థుల విజ్ఞప్తిపై సంబంధిత అధికారులు స్పందించి, అర్హులైన వరద బాధితులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు..

6, ఆగస్టు 2026, గురువారం

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి: అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి : అదనపు కలెక్టర్ బి.శ్రీరాములు

జిల్లా అధికారులతో సమీక్ష.. ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాల..
స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు

స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమావేశంలో పాల్గొన్న జిల్లా అధికారులు
రామగుండం, ఆగస్టు 6 (ఇది మన హక్కు): జిల్లాలో నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు సంబంధిత అధికారులను ఆదేశించారు.

గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా వేడుకలకు హాజరు కావాలని సూచించారు.
ఫ్లాగ్ ఏర్పాట్లు, గ్రౌండ్ సిద్ధం, డయాస్, సీటింగ్ ఏర్పాట్లు, భద్రత, వైద్య శిబిరాలు, అంబులెన్స్, తాగునీటి సదుపాయాలు తదితర ఏర్పాట్లను సంబంధిత శాఖలు సమన్వయంతో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వాన పత్రాల పంపిణీతో పాటు ముఖ్య అతిథి సందేశానికి అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి. గంగయ్య, కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.



 



జీఎన్‌ఎమ్ నర్సింగ్ విద్యార్థినికి ఆర్థిక చేయూత వి.ఎస్.ఎస్.ఎస్. ఆధ్వర్యంలో మూడు సంవత్సరాల పాటు నెలకు రూ.1,000 అందజేత

 ఇది మన హక్కు పెద్దపెల్లి జిల్లా బ్యూరో రిపోర్టర్✍️

జీఎన్‌ఎమ్ నర్సింగ్ విద్యార్థినికి ఆర్థిక చేయూత వి.ఎస్.ఎస్.ఎస్. ఆధ్వర్యంలో మూడు సంవత్సరాల పాటు నెలకు రూ.1,000 అందజేత

వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సీహెచ్ కిషోర్ సాయం.. తొలి విడతగా రూ.3,000 అందజేత

రామగుండం, ఆగస్టు 6 : { ఇది మన హక్కు} : 

ఆర్థిక ఇబ్బందులతో జీఎన్‌ఎమ్ నర్సింగ్ విద్యను కొనసాగిస్తున్న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సప్తగిరి కాలనీకి చెందిన విద్యార్థిని సిరివేన అక్షయకు వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ (VSSS) ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు..గోదావరిఖని మేదర్‌బస్తిలోని చంద్రశేఖర్ కిరాణా మర్చంట్ నిర్వాహకులు సీహెచ్ కిషోర్, తన తండ్రి సీహెచ్ చంద్రశేఖర్ జ్ఞాపకార్థం విద్యార్థిని జీఎన్‌ఎమ్ మూడేళ్ల కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి నెల రూ.1,000 చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా మూడు నెలలకు సంబంధించిన రూ.3,000ను విద్యార్థినికి అందజేశారు..

ఈ సందర్భంగా వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్ డా. సురభి శ్రీధర్ మాట్లాడుతూ, సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన అక్షయ ప్రస్తుతం అమ్మమ్మ వద్ద ఉంటూ, ఆమె కూలి పని చేసి చదివిస్తోందని చెప్పారు. విద్యార్థిని చదువుకు సహాయం కోరగా సీహెచ్ కిషోర్ స్పందించి మూడు సంవత్సరాల పాటు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.

విద్యార్థిని చదువుకు చేయూతనిస్తున్న సీహెచ్ కిషోర్ మరియు వారి కుటుంబ సభ్యులకు వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ తరఫున డా. సురభి శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ గడవేన సదానందం, విద్యార్థిని కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

తల్లి పాలే శిశువుకు సంపూర్ణ ఆరోగ్యానికి తొలి అడుగు: నగర మేయర్ మహంకాళి స్వామి

తల్లి పాలే శిశువుకు సంపూర్ణ ఆరోగ్యానికి తొలి అడుగు: నగర మేయర్ మహంకాళి స్వామి

తల్లి పాల వారోత్సవాల సందర్భంగా అక్షరాభ్యాసం, అన్నప్రాశన, శ్రీమంతం కార్యక్రమాలు ఘనంగా నిర్వహింపు

తల్లి పాల వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్ మహంకాళి స్వామి

అక్షరాభ్యాసం కార్యక్రమంలో చిన్నారులకు ఆశీర్వాదం అందిస్తున్న అతిథులు

అన్నప్రాశన, శ్రీమంతం కార్యక్రమాల్లో పాల్గొన్న గర్భిణీలు, బాలింతలు

కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు

గోదావరిఖని, ఆగస్టు 6 (ఇది మన హక్కు): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4వ డివిజన్ స్వాగత్ ఫంక్షన్ హాల్‌లో సీడీపీఓ అలేఖ్య ఆధ్వర్యంలో తల్లి పాల వారోత్సవాల సందర్భంగా అక్షరాభ్యాసం, అన్నప్రాశన, శ్రీమంతం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ మహంకాళి స్వామి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, పుట్టిన శిశువుకు తల్లి పాలు అమృతంతో సమానమని, తొలి ఆరు నెలలు పూర్తిగా తల్లి పాలు మాత్రమే ఇవ్వడం ద్వారా శిశువు ఆరోగ్యంగా ఎదుగుతాడని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అంగన్వాడీ కేంద్రాలు అందిస్తున్న సేవలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తల్లి పాల ప్రాధాన్యంపై సమాజంలో మరింత అవగాహన పెంపొందించాలని పిలుపునిచ్చారు.
4వ డివిజన్ కార్పొరేటర్ కంకణాల మౌనిక రాజు మాట్లాడుతూ, తల్లి పాల వారోత్సవాల నిర్వహణతో తల్లుల్లో అవగాహన పెరుగుతుందని, అక్షరాభ్యాసం, అన్నప్రాశన, శ్రీమంతం వంటి సంప్రదాయ కార్యక్రమాలను ఒకే వేదికపై నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రతి కుటుంబం తల్లి పాల ప్రాముఖ్యతను గుర్తించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ కార్పొరేటర్ వేగొళపు రమాదేవి, 5వ డివిజన్ కార్పొరేటర్ సత్యప్రసాద్, పలువురు కార్పొరేటర్లు, సూపర్వైజర్ జామున, ఇన్‌చార్జి అనిల్, అంగన్వాడీ సిబ్బంది బి. మంజుల, బి. శ్రీవాణి, ఎస్. రజిత, కే. అరుణ, బి. రాజలక్ష్మి, బి. సరోజ, కే. నర్మద, కే. స్వరూప, ఆశా వర్కర్లు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు..

2, ఆగస్టు 2026, ఆదివారం

తబితా ఆశ్రమంలో ఘనంగా ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు.. చిన్నారులతో కేక్ కట్ చేసిన మద్దెల దినేష్

తబితా ఆశ్రమంలో ఘనంగా ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు.. చిన్నారులతో కేక్ కట్ చేసిన మద్దెల దినేష్

ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో వేడుకలు.. చిన్నారులతో కలిసి మిత్రుల దినోత్సవాన్ని జరుపుకున్న ప్రముఖులు


రామగుండం తబితా ఆశ్రమంలో చిన్నారులతో కలిసి ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా కేక్ కట్ చేస్తున్న ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్
రామగుండం, ఆగస్టు 3 (ఇది మన హక్కు): రామగుండం నియోజకవర్గంలోని తబితా ఆశ్రమంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో ఫ్రెండ్‌షిప్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి మిత్రుల దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు.

ఈ కార్యక్రమానికి ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ ముఖ్య అతిథిగా హాజరై ఆశ్రమంలోని చిన్నారులకు కేక్ పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నారులందరూ బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు లేని లోటు తెలియకుండా ఆశ్రమ నిర్వాహకుడు వీరేంద్ర నాయక్ పిల్లలను సొంత పిల్లల్లా చూసుకుంటూ పెంచుతున్న తీరు అభినందనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు తొడుపునూరి రమేష్ కుమార్, ఏఐటీయూసీ సీనియర్ నాయకుడు ఎం.ఏ. గౌస్, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వై. లెనిన్ తదితరులు పాల్గొని చిన్నారులకు ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆశ్రమంలోని చిన్నారులు పాటలు, ఆటపాటలతో సందడి చేస్తూ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు..

31, జులై 2026, శుక్రవారం

ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: మేయర్ మహంకాళి స్వామి, కమిషనర్ అరుణ శ్రీ

ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: మేయర్ మహంకాళి స్వామి, కమిషనర్ అరుణ శ్రీ

వర్షపు నీటిని భూగర్భ జలాల్లోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలి.. ఇంకుడు గుంత నిర్మించి వివరాలు సమర్పిస్తే డిపాజిట్ రుసుము తిరిగి చెల్లింపు


వర్షపు నీటి సంరక్షణపై అవగాహన కల్పిస్తున్న రామగుండం మేయర్ మహంకాళి స్వామి, కమిషనర్ జె. అరుణ శ్రీ
రామగుండం, జూలై 31 (ఇది మన హక్కు): భూగర్భ జల మట్టం పెంపొందించేందుకు ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఇంకుడు గుంత (రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ పిట్) నిర్మించుకోవాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, కమిషనర్ జె. అరుణ శ్రీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వారు మాట్లాడుతూ, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నివాస గృహాలు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలు, ఇతర భవనాల్లో వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కోరారు.
భవన నిర్మాణ అనుమతి సమయంలో ఇంకుడు గుంత నిర్మాణానికి సంబంధించి డిపాజిట్ రుసుము చెల్లించిన వారు నిర్మాణం పూర్తిచేసి ఫోటోలు, వివరాలు సమర్పిస్తే ఆ డిపాజిట్ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని తెలిపారు.
'జల్ సంచయ్ జన భాగీదారి' కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో వర్షపు నీటి సంరక్షణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం కురుస్తున్న విస్తారమైన వర్షాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి నీటి బొట్టును భూగర్భ జలాల్లోకి ఇంకేలా చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని, ప్రజలు స్వచ్ఛందంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఇప్పటికే వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్న వారు వాటిని శుభ్రపరచి సక్రమంగా పనిచేసేలా నిర్వహించుకోవాలని సూచించారు.

గోదావరిఖనిలో ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్ శిబిరం.. 38 మందిని రేకుర్తి ఆసుపత్రికి తరలింపు

గోదావరిఖనిలో ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్ శిబిరం.. 38 మందిని రేకుర్తి ఆసుపత్రికి తరలింపు

లైన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో 72 మందికి కంటి పరీక్షలు..

గోదావరిఖని కళ్యాణ్‌నగర్‌లో నిర్వహించిన ఉచిత కంటి పరీక్షల శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య బృందం
కంటి ఆపరేషన్ కోసం ఎంపికైన లబ్ధిదారులతో లైన్స్ క్లబ్ సభ్యులు, ప్రజాప్రతినిధులు

గోదావరిఖని, జూలై 31 (ఇది మన హక్కు): గోదావరిఖని పట్టణంలోని కళ్యాణ్‌నగర్ 52వ డివిజన్ రాజస్థాన్ భవన్‌లో లైన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని ఆధ్వర్యంలో, కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్ శిబిరం నిర్వహించారు.

శిబిరంలో మొత్తం 72 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, కంటి ఆపరేషన్ అవసరమైన 38 మందిని ప్రత్యేక బస్సులో కరీంనగర్‌లోని రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి బీపీ, షుగర్ తదితర ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఈ విడతలో తరలించలేకపోయామని, తదుపరి శిబిరంలో వారికి అవకాశం కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో 52వ డివిజన్ కార్పొరేటర్ చిధ్రల నాగరాజు, లైన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని అధ్యక్షుడు చిట్టిమల కిషోర్, కార్యదర్శి అల్లాడి నాగరాజు, ట్రెజరర్ చింతకింది కృష్ణ, లియో టు లయన్స్ కోఆర్డినేటర్ నార్ల ప్రసాద్, జోన్ చైర్మన్ కొమరవెల్లి సుధాకర్, లక్ష్మీవాణి, లైన్స్ క్లబ్ ఆఫ్ లక్ష్మీనగర్ అధ్యక్షుడు అనఘం కృష్ణమూర్తి, డీసీ విజన్ కోఆర్డినేటర్ చందర్ గుప్తా, డీసీ ఐ క్యాంప్స్ స్క్రీనింగ్ కోఆర్డినేటర్ మామిడిపల్లి శ్రీధర్, లైన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి అధ్యక్షుడు కోదాటి ప్రవీణ్, లైన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని వాసవి అధ్యక్షుడు కొమరవెల్లి రాహుల్‌తో పాటు లైన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు..